శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (18:01 IST)

'మిగ్జామ్' తుపాను.. తమిళనాడును ముంచేసింది.. అంధకారంలో..?

మిగ్‌జాం తుపాను
'మిగ్జామ్' తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. స్కూళ్లు, కార్యాలయాలు మూతపడ్డాయి. విమాన సర్వీసులు ఆగిపోయాయి. 
 
చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, తాము గత 24 గంటలుగా అంధకారంలో మగ్గుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి 34 సెంమీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెన్నై ప్రజలు బయటికి రావొద్దని నగరపాలక వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
 
అదేవిధంగా, భారీ వర్షాల కారణంగా వ్యాసర్‌పాడి మరియు బేసిన్ బ్రిడ్జి మధ్య బ్రిడ్జ్ నంబర్ 14 వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో చెన్నై సెంట్రల్ నుండి 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. నివాస ప్రాంతాల్లో వరదనీరు రావడంతో జనం నానా తంటాలు పడుతున్నారు. 
 
అలాగే నివాస ప్రాంతాల్లో పాములు వస్తున్నాయని.. చెరువుకు సమీప ప్రాంతాల్లో మొసళ్లు కూడా కనిపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా పల్లికరణై ప్రాంతం భారీగా వరద నీటితో మునిగిందని.. నివాస ప్రాంతాల్లో నీరు చేరడంతో పాటు వాహనాలు వరద నీటితో కొట్టుకుపోయాయి. చెన్నై భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.