1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2023 (13:33 IST)

కోస్తాంధ్రను భారీ వర్షాలతో కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను

మిగ్‌జాం తుపాను
మిగ్ జాం తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతం సముద్ర తీరానికి సమాంతరంగా కదులుతూ వస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావారణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
 
తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా జిల్లాలకు ముప్పు పొంచి వుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనీ సూచిస్తున్నారు. తిరుమల తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమల స్వామివారి దర్శనానంతరం చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను దర్శించేందుకు భక్తులు ప్రస్తుతం వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.