1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (12:57 IST)

కరోనా సోకిన తల్లికి బెడ్ దొరకలేదని ఎమ్మెల్యే కుసుమ శివళ్లి కంటతడి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంది. కరోనా రోగులతో ఆస్పత్రుల్లోని పడకలన్నీ నిండుకున్నాయి. దీంతో వీవీఐపీల కుటుంబ సభ్యులకే ఆస్పత్రుల్లో పడకలు దొరకని విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తల్లికి ఆస్పత్రిలో బెడ్ దొరక లేదు. దీంతో ఆ ఎమ్మెల్యే కంటతడిపెట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల కర్నాటక రాష్ట్ర ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి కంటతడిపెట్టారు. సోమవారం ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ రూపంలో కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ సమావేశం నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఎమ్మెల్యే కుసుమ శివళ్ళి ఒక్కసారిగా కంటతడిపెట్టి తన కన్నతల్లి కరోనా బారినపడ్డారని, పరిస్థితి సీరియ్‌సగా ఉందని హుబ్బళ్ళి మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో ఓ పడక సమకూర్చుకోలేకపోతున్నానని రోదించారు. వెంటనే స్పందించిన సిద్ధరామయ్య, కిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. 
 
రాష్ట్రంలో పరిస్థితి విషమంగా ఉందని చామరాజనగర్‌లో కరోనా బాధితులు ఆక్సిజన్‌ లభించక 24మంది మృతి చెందారన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితులకు అవసరమైన సేవలు కల్పించాలని కొవిడ్‌ బాధితులలో మనోధైర్యం నింపాలని సూచించారు.