శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (10:45 IST)

సరిహద్దుల్లో జవాన్లను చంపేస్తుంటే.. నవజ్యోత్ వెళ్లి హత్తుకుంటారా?

సరిహద్దుల్లో భారత జవాన్లను చంపేస్తుంటే మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం ఇపుడు తీవ్రవిమర్శలకు దారితీసింది. సిద్ధూ చేసిన పనిని ప్రతి

సరిహద్దుల్లో భారత జవాన్లను చంపేస్తుంటే మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోతి సింగ్ సిద్ధూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం ఇపుడు తీవ్రవిమర్శలకు దారితీసింది. సిద్ధూ చేసిన పనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా తప్పుబట్టారు. అయితే, సిద్ధూ చర్యలన్నీ ఆయన వ్యక్తిగతమనీ, ప్రభుత్వానికిగానీ, కాంగ్రెస్ పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదనీ తేల్చిచెప్పారు.
 
మాజీ క్రికెటర్, తన సహచరుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ వెళ్లారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ బాజ్వాను పంజాబ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆలింగనం చేసుకున్నారు. ఇదే విమర్శలకు దారితీసింది. 
 
దీనిపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ స్పందిస్తూ, జనరల్ బాజ్వా పట్ల ఆప్యాయత ప్రదర్శించడం తప్పిదమన్నారు. పాకిస్థాన్ సేనల వైఖరితో ప్రతి రోజూ సరిహద్దుల్లో మన సైనికులు అమరులవుతున్నారు. పాక్ ఆర్మీ అధిపతి బాజ్వాను హత్తుకోవడానికి పూర్తిగా తాను వ్యతిరేకం. అతడి ఆదేశానుసారమే పాక్ సైనికుల దాడిలో రోజూ మన సైనికులు అమరులవుతున్నారని సిద్ధూ అర్థం చేసుకోవాలి అని అమరిందర్ సింగ్ హితవు పలికారు.
 
గతంలో తాను పనిచేసిన రెజిమెంట్ పరిధిలో కొన్ని నెలల క్రితమే భారత సైన్యం ఒక మేజర్, ఇద్దరు జవాన్లను కోల్పోయిందని అమరిందర్ గుర్తుచేశారు. దీనికి పాక్ సైన్యానికి ఆ దేశ సైనికాధ్యక్షుడు బాజ్వా జారీచేసే ఆదేశాలే కారణమన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారానికి సిద్ధూ వ్యక్తిగత హోదాలోనే పాకిస్థాన్ వెళ్లారని, కాంగ్రెస్‌కు సంబంధం లేదని అమరిందర్‌ సింగ్ తేల్చి చెప్పారు.