దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు
దేశ చరిత్రలోనే తొలిసారి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు తొలిసారిగా, తన సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ల విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దిశగా సుప్రీంకోర్టు ఒక బలైన ముందడుగు వేసినట్టయింది.
ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ జూన్ 24వ తేదీన సుప్రీంకోర్టు ఒక అంతర్గత సర్క్యులర్ను జారీచేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం రిజర్వేషన్ల విధానం జూన్ 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేశాయి. దీని ప్రకారం కోర్టులో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ వర్గాలకు 15 శాతం, ఎస్టీ వర్గాలకు 7.5 శాతం కోటం వర్తిస్తుంది. ఈ రిజర్వేషన్లు అమలు కోసం రూపొందించిన మోడల్ రిజర్వేషన్ రోస్టర్, సంబంధిత రిజిస్టర్లు వివరాలను కోర్టు అంతర్గత నెట్వర్క్ అయిన సుప్నెట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఈ రిజర్వేషన్ విధానం సుప్రీంకోర్టులోని రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు వంటి పలు స్థాయిల్లో పోస్టులకు వర్తించనుంది. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. విడుదల చేసిన రిజర్వేషన్ జాబితాలో ఏవైనా లోపాలు ఉన్నాయని భావిస్తే సిబ్బంది తమ అభ్యంతరాలను నేరుగా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకురావొచ్చని సర్క్యులర్లో పేర్కొన్నారు. ప్రస్తుత భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి హయాంలో ఈ చారిత్రక నిర్ణయం వెలువడటం గమనార్హం.