కన్నడ నటుడు దర్శన్కు బెయిల్ ... న్యాయాధికారం దుర్వినియోగం : సుప్రీంకోర్టు
కన్నడ నటుడు దర్శన్కు కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంలో న్యాయాధికారం దుర్వినియోగమైందని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కింది కోర్టు తప్పులు చేస్తే పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ, హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయాధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పును తాము పునరావృత్తం చేయబోమని స్పష్టం చేసింది. దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటన చేసేందుకు ఇపుడే ఎలాంటి తీర్పు వెలువరించబోమని ప్రధాన నిందితురాలు పవిత్రగౌడ తరపున న్యాయవాదికి సుప్రీంకోర్టు తెలిపింది.
అరెస్టు చేయడానికి తగిన ఆధారాలు లేవని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిగువ కోర్టు పొరపాటు చేస్తే పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ హైకోర్టు న్యాయమూర్తి అలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కాగా, కర్నాటకో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.