శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (10:23 IST)

ఐశ్వర్యారాయ్‌తో కాపురం చేయలేను.. ఆమె హైక్లాస్... తేజ్ ప్రతాప్

పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన భార్య నుంచి వేరుపడాలని నిర్ణయం తీసుకున్నారు. మా ఇద్దరి దిక్కులు వేరని, అందుకే ఆర్నెల్లు కూడా కాకుండానే విడిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. పైగా, విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్టు చెప్పారు. 
 
ఈ యేడాది మే నెల 12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఐశ్వర్యరాయ్ అనే యువతితో అట్టహాసంగా పెళ్లి జరిగింది. రాజకీయ నేతలు సహా వెయ్యి మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. డిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్యారాయ్ ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికైన చంద్రికా రాయ్ కుమార్తె. 
 
కానీ, వీరిద్దరూ ఇపుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ, 'మా దిక్కులు కూడా వేరు. మేము విడిపోవాలని అనుకోవడానికి కూడా అదే కారణం' అని ఆయన చెప్పుకొచ్చాడు. 'ఇంకెంత మాత్రం ఆమెతో కలిసి జీవించాలనుకోవడం లేదు' అని కుండబద్ధలు కొట్టారు.
 
కాగా, విడాకులకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించిన తేజ్ ప్రతాప్ 'మీరు విన్నది నిజమే. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. నేను ఉత్తర ధ్రువాన్నయితే, ఆమె దక్షిణ ధ్రువం. మా తల్లిదండ్రుల కళ్ల ముందే మా ఇద్దరి మధ్య చాలా గొడవే జరిగింది. ఇంకెంతమాత్రం ఆమెతో కలిసి కాపురం చేయలేను' అని చెప్పారు.