శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 జనవరి 2021 (15:53 IST)

అత్యాచారం చేయబోయాడు, కత్తితో పొడిచి చంపేసింది, ఆపై పోలీసులకు ఫోన్

తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఓ కామాంధుడిని ఓ యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. ఆ తర్వాత తనే పోలీసులకు ఫోన్ చేసి యువకుడిని హత్య చేసినట్లు తెలిపింది.
 
పూర్తి వివరాలు చూస్తే.. తమిళనాడు తిరువళ్లూరు షోలవరం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి పట్ల ఆమె కజిన్ గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. తన కోర్కె తీర్చాలంటూ వెంటబడుతున్నాడు. ఈ వ్యవహారంపై యువతి పెద్దలు అతడిని మందలించారు కూడా. ఐనా అతడు తన పద్ధతి మార్చుకోలేదు.
 
యువతి బహిర్భూమికి వచ్చినప్పుడు సమీపంలో మాటువేసి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారం చేద్దామని కత్తి తీసాడు. కానీ ఇద్దరి మధ్య పెనుగులాటలో అతడి వద్ద కత్తి కిందపడిపోయింది. దాన్ని యువతి అందుకుంది. తనవద్దకు రావద్దనీ, వస్తే పొడిచి చంపేస్తానని హెచ్చరించింది. ఐనా అతడు వినిపించుకోలేదు.
 
ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో కత్తితో యువకుడి మెడపై పొడిచింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. తను అతడిని హత్య చేయడానికి గల కారణాలను వివరించింది. యువతిపై పోలీసులు సెక్షన్ 100 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మరక్షణలో భాగంగా యువతి ఆ పని చేయాల్సి వచ్చిందని పోలీసులు కూడా తెలిపారు.