మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi

దినకరన్‌ది హవాలా ఫార్ములా.. దొడ్డిదారిలో పార్టీలోకి వచ్చారు: ఈపీఎస్

ఆర్కే నగర్ ఎన్నికల్లో విజయం సాధించిన శశికళ మేనల్లుడు దినకరన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఏకిపారేశారు. ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని.. కామెంట్స్ చేసిన దినకరన్‌కు ఈపీఎస్ కౌంటరిచ్చారు. దినక

ఆర్కే నగర్ ఎన్నికల్లో విజయం సాధించిన శశికళ మేనల్లుడు దినకరన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ఏకిపారేశారు. ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని.. కామెంట్స్ చేసిన దినకరన్‌కు ఈపీఎస్ కౌంటరిచ్చారు. దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారని అన్నారు.

ఆర్కే నగర్‌లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంతకాలం మాత్రమే అనుభవించగలరని ఈపీఎస్ జోస్యం చెప్పారు. అంతేగాకుండా దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళ్తారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 
 
తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కార్యకర్త స్థాయి నుంచి తాము అన్నాడీఎంకే పని చేశామని గుర్తు చేశారు. పనిలో పనిగా ఓపీఎస్ కూడా దినకరన్‌పై దుమ్మెత్తిపోశారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ ఎల్ కేజీ విద్యార్థిలాంటి వాడని ఎద్దేవా చేశారు.

జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2008లోనే దినకరన్‌ను బహిష్కరించారని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ చేస్తున్న యత్నాలు ఫలించవని అన్నారు. 
 
ఊటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈపీఎస్ మాట్లాడుతూ, అమ్మ పుట్టిన రోజు ఫిబ్రవరిలో రానున్న నేపథ్యంలో సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, సంక్రాంతికి పచ్చిబియ్యం, బెల్లం కిట్ అందజేస్తామని ప్రకటించారు. అమ్మ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.