కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్లు అండగా ఉన్నారు.. గెలుపు మాదే : హరీశ్ రావత్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠత తొలగిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు మంగళవారం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ పరీక్షా ఫలితాన్ని షీల్డు కవర్లో ఉంచి సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది.
అయితే విశ్వాస పరీక్ష అనంతరం మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఆనందంగా నవ్వుతూ కనిపించారు. విజయం గుర్తు చూపుతూ ఆయనతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకొచ్చారు. విజయం పట్ల తాము విశ్వాసంతో ఉన్నామన్నారు. ముఖ్యంగా కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్.. దేవుళ్లు తమకు అండగా ఉన్నారని, ఈ దేవుళ్ళతోపాటు.. ప్రజల మద్దతు కూడా ఉందని అందువల్ల గెలుపు తమదేనని చెప్పారు.
కాగా, ఈ బలపరీక్ష ఫలితాలను సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించనుంది. ఈ విశ్వాస పరీక్షలో భాజపాకు 28, కాంగ్రెస్కి 33 ఓట్లు వచ్చినట్టు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.