1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 మే 2016 (16:30 IST)

డాన్స్‌లతో హోరెత్తించిన ముంబై ఆస్పత్రి సిబ్బంది...

సాధారణంగా మనం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ ప్లీజ్ సైలెంట్ అని బోర్డు ఉంటుంది. అంటే ఆసుపత్రిలో నిశ్శబ్దం పాటించాలని అర్థం. కాని దీనికి విరుద్ధంగా ముంబైలోని దివాలీబెన్ మెహతా ఆసుపత్రిలో మ్యూజిక్, డాన్స్‌లతో హోరెత్తిపోయింది. ఆసుపత్రిని ఏకంగా పబ్‌లా మార్చేశారు. పెద్ద పెద్ద సౌండ్లతో స్పీక‌ర్లు ఏర్పాటు చేసి ఆసుప‌త్రిలో ఉన్న న‌ర్సుల‌తో పాటు చిన్న‌పిల్ల‌లు, మ‌హిళ‌లు త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్టు డాన్స్ చేశారు. 
 
మైనర్ అమ్మాయిలను తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్టు చిందులేయించారు. ఎన్నో రోగాల‌తో వైద్యం కోసం వ‌చ్చే రోగుల‌కు చికిత్స అందించి వారు కోలుకునేలా చేయాల్సిన కనీస బాధ్య‌త అక్క‌డి వైద్యుల‌తో పాటు న‌ర్సులకు కూడా ఉంది. అయితే రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు ఆస్పత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన వైద్య సిబ్బంది ఆసుపత్రిని ఓ ఫంక్ష‌న్ హాల్‌లా మార్చేసి త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్టు డ్యాన్సు చేశారు.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అసౌకర్యం కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా గంతులేశారు. వైద్య సిబ్బంది, నర్సుల నిర్వాకం చూసి రోగులు అవాక్కయ్యారు. ఇదిలావుంటే వీరు చేస్తోన్న డ్యాన్సుల‌ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.