శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 జూన్ 2016 (20:30 IST)

ఎ.టి.ఎ ఆధ్వర్యంలో జూలై 8,9,10న డెట్రాయిట్‌లో అంతర్జాతీయ తెలంగాణ మహాసభలు...

ఎ.టి.ఎ ఆధ్వర్యంలో జూలై 8,9,10న నిర్వహించనున్న అంతర్జాతీయ తెలంగాణ మహాసభల కార్యక్రమం కోసం ఫండ్ రైజింగ్ సమావేశాన్ని జూన్ 3న అమెరికాలోని సెయింట్ తోమ చర్చిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 800 మంది పాల్గొన్నారు. అనూహ్యంగా కొద్ది గంటల్లోనే 4 లక్షల డాలర్లు వసూలయ్యాయి. ఎ.టి.ఎ కన్వీనర్ కుకునూర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం గురించి వర్జీనియాలో స్నేహితులకు వివరించానన్నారు. ఆ సమయంలో సమావేశాన్ని చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్, డల్లాస్ నగరాల్లోని ఏదేని నగరంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాత పలు చర్చల అనంతరం డెట్రాయిట్ ఎంపిక చేశామన్నారు. దీనికి కారణం... ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఎక్కువగా ఉండటమేనన్నారు.
 
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభిస్తారనీ, మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు సభకు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. ఇంకా అమెరికా, భారత్, ఇతర దేశాల నుంచి ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. అమెరికాలోని 35 ప్రాంతీయ తెలుగు అసోసియేషన్లకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.
 
మూడురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వినోదభరితమైన ప్రోగ్రాములు కూడా ఉంటాయని వైస్ కన్వీనర్ నాగేందర్ ఐత వెల్లడించారు. జూలై 8న పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. వ్యాపారం, విద్య, సాహిత్యంలో ప్రగతి సాధించినవారికి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జూలై 9న ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన పాటకు 60 మందికి పైగా చిన్నారులు ప్రదర్శన ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకుమ్మ, బోనాలకు సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ సంగీత విభావరితో జూలై 8 కార్యక్రమం ముగుస్తుంది. 9న తెలంగాణలోని యాదగిరిగుట్ట నుంచి తెప్పించిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలతో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరుగుతుందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి పూజారులు వస్తారన్నారు. ఈ కార్యక్రమాలన్నిటినీ విజయవంతంగా నిర్వహించేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నట్లు కుక్నూర్ తెలిపారు. ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడుతూ... 400 వేల డాలర్ల విరాళాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.