గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (19:29 IST)

రథసప్తమి రోజున చేయాల్సిన పనులేంటి? తులసీకోట ముందు నెయ్యి దీపం..?

రథ సప్తమి రోజున  ''జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే'' అనే మంత్రం చదువుతూ ఏడు జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయి. ఆ రోజున నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. 
 
తులసీ కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం వుంచి దేవుడికి నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రథసప్తమి రోజున దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం, చిమ్మిలి దానం చేస్తే సకలశుభాలు చేకూరుతాయని విశ్వాసం. రథసప్తమి స్నానం, జప, అర్ఘ్యప్రదానం, తర్పణ, దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తాయని పండితుల వాక్కు. 
 
ఇంకా రథసప్తమి రోజున చేయాల్సిన పనులేంటంటే.. సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి... ఇంటిని శుభ్రపరచుకుని, వాకిట్లో రథం ముగ్గు వేసుకుని ఏడు జిల్లేడు ఆకులను తలపై, భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్య భగవానుని మన:స్పూర్తిగా భక్తీ శ్రద్ధలతో పూజించాలి. 
 
ఆపై పొంగలిని లేదా పరమాన్నాన్ని నైవేద్యం నివేదన చేసి, ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప, దూప, నైవేద్య ,కర్పూర హారతి ఇచ్చాక, రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవుపాలు కొన్ని.. ఎర్రని పువ్వు చెంబులో వేసి రెండు చేతులతో చెంబును చేత పట్టుకుని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యున్ని చూస్తూ మనస్పూర్తిగా స్వామి వారికి నమస్కారం చేస్తూ ''ఓం శ్రీ సూర్య నారాయణాయ నమ:'' అని స్మరిస్తూ.. చేస్తూ రాగి చెంబులో ఉన్ననీళ్ళను భూమిపైకి వదలాలి. 
 
ఇలా అర్ఘ్యమిచ్చాక.. సాష్టాంగ నమస్కరం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి, శుభ్రంగా చేతులు కడుక్కుని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలో గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులోకాని, ఆకులతో చేసిన విస్తరిలో పెట్టి ఆవునకు తినిపించాలి. గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలాచేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. అనారోగ్యాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి.