శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (11:25 IST)

అలిపిరి రాజగోపురంపై అరుదైన దృశ్యం... పెద్ద చరిత్రే ఉంది... వెంకటేశుని భక్తులు చెప్పే దాకా...

నిజమే... ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగింది.. అలిపిరి పాదాల మండపం. అలిపిరి పాదాల మండం ప్రారంభంలో మెట్లు ఎక్కగానే అతిపెద్ద రాజగోపురం కనిపిస్తుంది. ఆ రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే విజయనగర రాజులు కట్టినట్లుగా మరికొంతమంది చెబుతుంటారు. రాజగోపురంలో ఎన్నో చిత్రాలను పురావస్తు శాఖ గుర్తించింది. అలాగే టిటిడి అధికారులు కూడా గుర్తించారు. అయితే ఆ గోపురంలోనే అతి అరుదైన దృశ్యాన్ని కొంతమంది భక్తులు గుర్తించి టిటిడికి తెలియజేశారు. అదేంటంటే..
 
వరాహస్వామి... వరాహస్వామి చిన్న విగ్రహాన్ని గోపురంలోనే అప్పట్లో చెక్కారు శిల్పులు. అయితే ఇప్పటివరకు టిటిడిగాని, పురావస్తుశాఖ అధికారులు గాని ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం విడ్డూరం. కాలిబాటన తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ చిత్రాన్ని చూసి టిటిడి అధికారులకు తెలియజేశారు. వరాహం (పంది) ఈ చిత్రం అరుదుగా కనిపిస్తుంటుంది. గోపురం కింద భాగానే ఈ వరాహం చిత్రం మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని టిటిడి అధికారులు గాని పురావస్తుశాఖ అధికారులు గుర్తించకపోవడం మాత్రం సందేహాన్ని రేకెత్తిస్తోంది. 
 
తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళినపుడు మొదటగా అందరు వెళ్ళేది వరాహస్వామి ఆలయానికే. ఎందుకంటే తిరుమల ఉండడానికే ప్రధాన కారణం వరాహస్వామేనని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో ఉన్న ప్రతి స్థలాన్ని వరాహస్వామి శ్రీవారికి ఇచ్చారంట. అందుకే శ్రీవారి ఆలయానికి ఎవరు వెళ్ళినా ముందుగా వరాహస్వామిని సేవించి స్వామి వద్దకు వెళుతుంటారు. శ్రీనివాసుని మీద భక్తులకు ఎంత భక్తి ఉందో అదే భక్తి వరాహస్వామిపై ఉందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. 
 
మరోవైపు శ్రీకృష్ణదేవరాయలకు అతి ఇష్టమైన వాటిలో వరాహం ఒకటి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు తన చిహ్నంగా వరాహాన్ని ఎంచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ ఆలయాన్ని నిర్మించినా వరాహ శిల్పాన్ని మాత్రం అందులో ఖచ్చితంగా చెక్కుతారట. చిత్తూరు జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ శ్రీకృష్ణదేవరాయలు చెక్కిందే. ప్రధానంగా శ్రీకాళహస్తిలోని అతిపెద్ద రాజగోపురాన్ని కట్టిందే శ్రీకృష్ణదేవరాయలు. ఆ గోపురంలో కూడా ఎక్కువగా వరాహం చిత్రాలు కనిపిస్తుండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే శ్రీకాళహస్తి రాజగోపురం పాతది కావడంతో అప్పట్లో కూలిపోయింది. 
 
ఇంకోవైపు అలిపిరి పాదాల మండపం వద్ద రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కాదు విజయనగర రాజులు నిర్మించారని మరికొందరు వాదిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందే విజయనగర రాజులే ఈ గోపురానికి శంఖుస్థాపనలు చేశారని అంటున్నారు. అంతేకాకుండా గోపురం పూర్తయ్యే సమయానికి శ్రీకృష్ణదేవరాయలు ప్రవేశించినట్లుగా కూడా చెబుతున్నారు. మరి పురాణాల్లో మాత్రం శ్రీకృష్ణదేవరాయలే అలిపిరి రాజగోపురాన్ని నిర్మించినట్లు స్పష్టంగా చెబుతున్నారు. 
 
పురాణాలు ఏం చెబుతున్నా అతి అరుదైన దృశ్యం మాత్రం అలిపిరి రాజగోపురంపై కనిపించడం మాత్రం భక్తులను మరింత భక్తి పారవశ్యంలోకి తీసుకెళుతోంది. ఎన్నోయేళ్ళ చరిత్ర కలిగిన అపురూప ఘట్టాలు చిత్తూరు జిల్లాలో ఉండడం తమ అదృష్టంగా ఇక్కడి వాసులు చెప్పుకుంటున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని తితిదే పాటు పురావస్తుశాఖ తమ రికార్డులో ఉంది.