గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (20:13 IST)

శనీశ్వరునికి నిరుపేద-ధనవంతుడు అనే తేడాలేదు, ఆ విషయంలో ఎవరైనా ఒక్కటే

శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరునిలా శనీశ్వరుడు కూడా భక్తుల కోర్కెలను తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శని గ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని పట్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 
జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః - అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చే వారు జనార్థనుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. ఎవరు ఎలాంటి కర్మలు చేశారు వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరిచాడట.
 
ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు. ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుకే తమకేం చెడు జరిగినా ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిన నాటి శని ఆరంభమైనట్టే.
 
శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కాలక్షేపాలు, సత్కార్యాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తుంది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన శనీశ్వరుని అనుగ్రహమే అందరికీ రక్ష అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.