1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
  4. Significance of chellapur nanda deepam

కార్తీక మాసం..చెల్లాపూర్‌ నందా దీపాన్ని దర్శించుకుంటే.. ?

Significance of chellapur nanda deepam
కార్తీక మాసంలో ఆలయాల్లో వెలిగించే అఖండ దీపాన్ని.. నందా దీపం అంటారు. గర్భాలయంలో కొలువైన దైవాన్ని ఈ దీపారాధన వెలుగులోనే దర్శించాలని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ దీపారాధన కొన్ని దేవాలయాల్లో 'అఖండ దీపం'గా కనిపిస్తూ వుంటుంది. అంటే ఈ జ్యోతిని కొండెక్కనీయకుండా చేస్తూ నూనె, వత్తులను మారుస్తూ ఉంటారు. ఈ అఖండ దీపాన్నే 'నందాదీపం' అని కూడా పిలుస్తుంటారు. 
 
ఇలా తరతరాలుగా వెలుగుతోన్న ఈ నందాదీపాన్ని దర్శించడం వలన సమస్త దోషాలు నివారించబడతాయని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటి 'నందా దీపం' మనకి చెల్లాపూర్‌లోని కృష్ణుడి ఆలయంలో కనిపిస్తుంది. 
 
మెదక్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి నందా దీపం రెండు వందల సంవత్సరాలపై నుంచి వెలుగుతూనే వుంది. ఆలయం తలుపులు మూసి వున్న సమయంలోను, ప్రధాన ద్వారానికి చేయబడిన రంధ్రం గుండా ఈ దీపం కాంతి కనిపిస్తూనే వుంటుంది. దైవ దర్శనం కాని వాళ్లు ఈ దీప దర్శనంతో సంతృప్తి చెందుతారు. 
 
ఈ ఆలయంలో మీసాలతో కృష్ణుడు దర్శనమిస్తాడు. ఈయన మహిమాన్వితుడనీ, ఆయన అనుగ్రహంతో వెలుగుతోన్న అఖండ దీప దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 
కష్టాల్లో ... బాధల్లో వున్న వాళ్లు 'నందా దీపం' మొక్కుని మొక్కుకుంటూ వుంటారు. ఒక మట్టి మూకుడులో నూనె పోసి, పెద్ద వత్తివేసి.. ఆలయానికి చేరుకొని అక్కడి నందా దీపంలోని జ్యోతితో ఆ వత్తిని వెలిగిస్తుంటారు. అలా దీపం వెలిగించబడిన మట్టి పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
About Writer
Selvi