విఐపి బ్రేక్ ఎల్-1 టికెట్లు 8 లక్ష రూపాయలు..!
తిరుమల శ్రీవారి సేవా టికెట్లను అధిక రేట్లకు విక్రయించే ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అది కూడా విఐపిలు దర్శనం చేసుకునే టికెట్లను వేల రూపాయల్లో ఈ ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా చేసిన బాగోతాలపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
నరసారావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసులరెడ్డి తానే స్వయంగా వస్తున్నట్లు వెంకటేష్ అనే వ్యక్తికి ఒక సిఫారసు లెటర్ను ఇచ్చి పంపించాడు. అయితే వెంకటేష్ ఆ లెటర్ను తీసుకుని జెఈఓ కార్యాలయంలో టికెట్ల కోసం ధరఖాస్తు చేశాడు. ఎమ్మెల్యే పేరు మీద 8 ఎల్-1 విఐపి దర్శనంతో పాటు మూడు అర్చన టికెట్లు మంజూరయ్యాయి. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. ఆ విషయాన్ని వెంకటేష్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు.
అయితే వెంకటేష్ ఆ టికెట్లను ఎక్కువ రేట్లకు విక్రయించాలని నిర్ణయించుకుని నగరికి చెందిన ఒక దళారీకి బేరం పెట్టాడు. ఎల్1 టికెట్లను ఒక్కోటి లక్ష రూపాయలకు విక్రయించగా 3 అర్చన టికెట్లను 50 వేలకు విక్రయించేశాడు దళారీ. ఎమ్మెల్యే పేరు మీద శుక్రవారం దర్శనానికి వెళ్ళిన వారిని గుర్తించిన తితిదే సిబ్బంది అనుమానంతో ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. భక్తులను దర్శనానికి పంపించేసిన తితిదే అధికారులు టికెట్లను విక్రయించిన వారి పేర్లను కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు తితిదే విజిలెన్స్ అధికారులు. దళారీలను పోలీసులు తిరుమలలోని ఒన్టౌన్ పోలీస్టేషన్లో విచారిస్తున్నారు.