ఉగాదిని పురస్కరించుకుని తిరుచానూరులో పుష్పపల్లకి సేవ
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను తితిదే నిర్వహించనుంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి పుష్పపల్లకీ సేవను తితిదే నూతనంగా ప్రవేశపెట్టనుంది.
ఇకపై ప్రతి ఉగాది పర్వదినం రోజున ఈ సేవను తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తితిదే నిర్వహించనుంది. ఉగాది రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణోత్సవంను నిర్వహించనున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో వేడుకగా అభిషేకంను జరుపుతారు.
సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు పుష్పపల్లకీలో అమ్మవారు వేంచేసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. రాత్రి 8 గంటల నుంచి 8.30 నిమిషాల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
