తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని తితిదే అధికారులు భావిస్తున్నారు. సర్వదర్శనం కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఒకటిన్నర కిలోమీటర్కు పైగా సర్వదర్శనం క్యూలైన్ బయటకు వచ్చేసింది. ఎండలోనే భక్తులు స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు.
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఇదే పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. కాలినడక భక్తులు 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 7 గంటలకుపైగా సమయం పడుతోంది. గదులు ఖాళీలు లేవు. గదుల కోసం భక్తులు క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన పరిస్థితి. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట వద్ద కూడా ఇదే పరిస్థితి. గురువారం శ్రీవారిని 71,995 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.22 కోట్ల మేరకు వసూలైంది.