తిరుమల తిరుపతి లడ్డూల అక్రమ బాగోతం... ఉద్యోగి సస్పెండ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. టీటీడీలో అటెండర్గా పనిచేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగి దాతలకు అందించే 60 వేల లడ్డూలను పక్కదారి పట్టించినట్టు తెలిసింది. ఈ విధంగా గత యేడాదికాలంగా లడ్డూలను నల్ల మార్కెట్లో విక్రయిస్తున్నాడని గుర్తించారు. దీంతో అతడిని తితేదే ఈవో సాంబశివరావు సస్పెండ్ చేశారు. రెండున్నరేళ్లుగా రమణ డోనర్ సెల్లో పనిచేస్తున్నాడని విజిలెన్స్ అధికారులు చెప్పారు.
ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తుండగా, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని తెలిపారు. వాస్తవానికి తితిదేలో అక్రమ లడ్డూల బాగోతం ఎప్పటి నుంచో జరుగుతోంది. గతంలో పలువురు టీవీ విలేకరులకు కూడా అక్రమ లడ్డూలతో పాటు.. దర్శన టిక్కెట్ల విక్రయంలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తూతూ మంత్రంగా విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
