Bonalu: వైభవంగా సంగారెడ్డిలో బోనాలు.. ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
సంగారెడ్డిలో బోనాలు వైభవంగా జరిగాయి. మంగళవారం నాడు సదాశివపేట- సంగారెడ్డి పట్టణాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు సంప్రదాయ ఉత్సాహంతో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు టి. నిర్మల జగ్గారెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆమె ముందుగా సదాశివపేటలోని దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గౌడ సంఘం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రేణుక చిరు, కౌన్సిలర్లు నాగరాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
అనంతరం, నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో జరిగిన బోనాల ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో పోతరాజుల సంప్రదాయ విన్యాసాలు ఆకట్టుకోగా, గొర్రెలతో అలంకరించిన ప్రత్యేక వాహనం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. ప్రముఖ జోగిని నిషా క్రాంతి కూడా ఈ వేడుకల్లో పాల్గొని, సంప్రదాయ ఆచారంలో భాగంగా బోనాన్ని సమర్పించారు.
