గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (09:09 IST)

తెలంగాణాలో ఐదు రోజుల పాటు వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ

rain
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్ష ప్రభావం పది జిల్లాలపై ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాలకు ఆరెంజ్ ఆలెర్ట్‌ను జారీచేసింది. అలాగే, మూడు రోజులకు రెడ్ అలెర్ట్ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ ద్రోణి సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని... రానున్న రెండుమూడు రోజుల్లో బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది.
 
ఇక తెలంగాణలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
 
శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.