గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (09:28 IST)

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ.. టీ సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం!

abhishek manu
తెలంగాణ రాష్ట్ర కోటాలో రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని హోటల్ షెరటాన్‌లో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ పేరును ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా తెలంగాణ మంత్రులు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అభిషేక్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో మను సింఘ్వీ సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.