శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:50 IST)

పీకల దాకా తాగి పక్కింటి కాలింగ్ బెల్ కొట్టాడు.. పాపం ప్రాణం పోయింది...

పీకల దాకా మద్యం తాగిన మత్తులో పక్కింటి తలుపు కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని చితక బాదడంతో మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నందనవనంకు చెందిన మొగిలి గోపాల్‌ (45) బస్తీలో కూలీగా పని చేసేవాడు. ఆదివారం సెలవుదినం కావడంతో  మద్యం సేవించి తన సోదరి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
సోదరి ప్లాట్‌ అనుకొని పక్కనే ఉన్న అంజలి అనే మహిళ ప్లాట్‌కు వెళ్లి కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. అంజలి బయటికి రాగా తాను పొరబడినట్లు తెలుసుకున్న గోపాల్‌ దాహంగా వుందని మంచినీళ్లు కావాలని అడిగాడు. దీంతో ఎవరో తాగివచ్చి మంచినీళ్లు అడుగుతున్నాడు అని అరవడంతో ఆమె సోదరుడు ఆనంద్‌ గోపాల్‌పై దాడికి దిగాడు. 
 
గోపాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆనంద్‌ వెనుక నుంచి బలంగా తన్నడంతో అతను మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందపడ్డాడు. దీనితో తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను అతని సోదరి కవిత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.