శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (15:41 IST)

చిరంజీవికి హీరోయిన్ల కొరత.. 'ఆచార్య'కు నో చెప్పిన అనుష్క?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు టాలీవుడ్‌లోనే కాదు.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వయంకృషితో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన హీరో. తన సినీ కెరీర్‌లో అనేక ఎత్తుపల్లాలను చవిచూసిన నటుడు. అలాంటి నటుడికి ఇపుడు హీరోయిన్లు చిక్కడం లేదు. అంటే ఆయన సరసన నటించేందుకు టాలీవుడ్ ముద్దుగుమ్మలు వరుసగా ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య"కు హీరోయిన్ దొరకడం గగనమైపోయింది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు నో చెప్పగా, తాజాగా మూడో హీరోయిన్ కాడా సారీ చెప్పినట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి. 
 
ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా చిత్రం షూటింగ్‌ను వాయిదావేశారు. అయితే, ఈ చిత్రం హీరోయిన్ కోసం ఆది నుంచి గాలిస్తున్నారు. ఇందులోభాగంగా, తొలుత త్రిషను ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆమె అభిప్రాయభేదాల కారణంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ పిమ్మట కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు. ఆమె ఏకంగా రూ.2 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేమని నిర్మాతలు తేల్చిచెప్పడంతో ఆమెను కూడా ఎంపిక చేయలేదు. ఆ తర్వాత అనుష్కను సంప్రదించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
'నిశ్శబ్దం'తో త్వరలో సందడి చేయనున్న అనుష్క అయితే చిరంజీవి పక్కన సరిపోతుందనుకున్నారు. అయితే డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్ల అనుష్క కూడా 'ఆచార్య'కు నో చెప్పేసిందట. దీంతో మరోమార్గం లేక చిరంజీవి పక్కన 'ఖైదీ నెంబర్ 150'లో నటించిన కాజల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.