శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (13:09 IST)

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలను పాటిస్తూ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అదేసమయంలో తనను కలిసినవారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరినట్టు ఆయన అధికార ప్రతినిధి ట్విట్టర్ ఖాతాలో ద్వారా వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గ‌త‌ 24 గంట‌ల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 23,907 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. 3,68,457 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 5,08,41,286 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,64,38,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,25,628 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.