శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (11:01 IST)

"గ్యాంగ్ లీడర్" బ్రదర్స్ అరుదైన కలయిక!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. మూడు దశాబ్దాల క్రితం అంటే 1991లో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవికి అన్నలుగా సీనియర్ నటుడు కె.మురళీ మోహన్, తమిళ హీరో శరత్ కుమార్‌లు నటించారు. ఇందులో శరత్ కుమార్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. 
 
అయితే, ఈ ముగ్గురు హీరోలు.. గ్యాంగ్ లీడర్ తర్వాత ఒక్కచోట కలుసుకున్న దాఖలాలు లేవు. ఇద్దరిద్దరు విడిగా కలిసిన సందర్భాలు ఉన్నాయిగానీ, అందరూ ఒకే చోటకు చేరలేదు.
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం చిరంజీవి కొత్త చిత్రం 'ఆచార్య' షూటింగ్ జరుగుతుండగా, అదేసమయంలో మురళీ మోహన్, శరత్ కుమార్‌లు తమతమ చిత్రాల కోసం అదే చోటకు వచ్చారు. 
 
ముగ్గురూ కలుసుకుని నాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. ముగ్గురమూ కలవగానే 1991లో తాము పాల్గొన్న సినిమా షూటింగ్ జ్ఞాపకం వచ్చిందని ఈ సందర్భంగా మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. 
 
అనుకోకుండా జరిగే ఘటనలు పాత అనుభూతులను గుర్తుకు తెస్తాయని వ్యాఖ్యానిస్తూ, ఈ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఇక ఈ పిక్‌ను చూసిన మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. నాటి సినిమా దృశ్యాలను, ఈ చిత్రాన్ని ఒక చోట చేర్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.