శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:39 IST)

తేజ దర్శకత్వంలో చిత్రం 1.1 సీక్వెల్.. 45మంది కొత్త ముఖాలు

Chitram 1.1
బాలీవుడ్‌లో స్టార్ సినిమాటోగ్రఫర్‌గా చక్రం తిప్పుతున్న తేజ 2000 సంవత్సరంలో దర్శకుడిగా మారాడు. అప్పటి వరకు నడుస్తున్న ట్రెండ్ బ్రేక్ చేస్తూ సంచలన సినిమా చేసాడు. అదే చిత్రం. పూర్తిగా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ కేవలం 80 లక్షల్లో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. నిర్మాత రామోజీ రావుకు లాభాల పంట పండించింది. 
 
ఈ సినిమాతోనే ఉదయ్ కిరణ్, రీమా సేన్ లాంటి వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్ అయ్యాడు.. వెంటనే డౌన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తేజ ఇప్పుడు మరోసారి చిత్రం చేస్తున్నాడు. ఈ సారి దీనికి సీక్వెల్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఫిబ్రవరి 22న పుట్టిన రోజు సందర్భంగా చిత్రం 1.1 ప్రకటించాడు ఈ దర్శకుడు. ఇది కూడా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్. 
 
అప్పట్లో చిత్రం ఎలాంటి సంచలనం రేపిందో.. ఇప్పుడు సీక్వెల్ కూడా అలాగే ఉండబోతుందని చెప్తున్నాడు తేజ. ఈ సారి కూడా పూర్తిగా కొత్త వాళ్లనే పరిచయం చేయబోతున్నాడు. 45 మంది న్యూ ఫేస్‌లను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించాడు తేజ.
 
ఈ సినిమాకు చిత్రం 1.1 అనే టైటిల్ ఖరారు చేయడమే కాకుండా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాతో ఆర్పీ పట్నాయక్ మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.
 
తేజ సొంత బ్యానర్ చిత్రం మూవీస్‌తో పాటు ఎస్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరి ఉదయ్ కిరణ్ లేని చిత్రం సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి.