మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (18:27 IST)

బాలీవుడ్ మూవీ దృశ్యం దర్శకుడు ఇకలేరు...

బాలీవుడ్ చిత్రం దృశ్యంకు దర్శకత్వం వహించిన నిషికాంత్ కామత్ ఇకలేరు. ఆయన వయసు 50 యేళ్లు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా ఆయన సోమవారం సాయంత్రం 4.24 గంటలకు చనిపోయినట్టు హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆయనను జూలై 31న ఆయను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఐసీయు వార్డుకు తరలించి చికిత్స చేయగా, ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ, ఉన్నట్టుండి ఆదివారం నుంచి ఆయన ఆరోగ్యం విషమంగా మారగా, సోమవారం సాయంత్రం కన్నుమూసినట్టు ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, నిషికాంత్ బాలీవుడ్‌లో ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన 2005లో వచ్చిన 'డోంబీవాలీ ఫాస్ట్' అనే మరాఠీ సినిమా ద్వారా కెరీర్ ఆరంభించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత మలయాళంతో పాటు అనేక భాషల్లో హిట్టయిన "దృశ్యం" చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేశారు.
 
నిషికాంత్‌కు దర్శకత్వంలోనే కాదు నటనలోనూ ప్రవేశం ఉంది. ఆయన 'హవా ఆనే దే', 'రాకీ హ్యాండ్సమ్' అనే హిందీ చిత్రాలతో పాటు ఓ మరాఠీ సినిమాలోనూ నటించారు. నిషికాంత్ మరణం పట్ల బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిజానికి నిషికాంత్ కొన్ని రోజుల క్రితమే చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ సోమవారం ఉదయమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఖండించారు కూడా. ఇంతలోనే నిషికాంత్ కామత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.