1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (16:55 IST)

మొక్కుబడిగా ఆస్కార్ అవార్డు విజేతల సన్మానం, ఆంధ్రకి అవమానం : నట్టి కుమార్ ఫైర్

Nattikumar
Nattikumar
తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఆదివారం సాయంత్రం జరిగిన ఆస్కార్ విజేతల సన్మాన సభను  మొక్కుబడిగా నిర్వహించినట్లుగా ఉందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, "ఆర్ ఆర్ ఆర్" సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన, అరుదైన ఆస్కార్ అవార్డు లభించడం చాలా చాలా సంతోషం. ప్రపంచలోని అన్ని సినిమా రంగాలు ఎదురుచూసే అవార్డు మన తెలుగు సినిమాకు దక్కడం తెలుగు వాళ్లు, తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ అంశం. దీంతో ఒక శిఖరానికి ఎక్కారు మనవాళ్ళు. అయితే అలాంటి ఆస్కార్ విజేతలకు తెలుగు చిత్ర పరిశ్రమ సన్మానం జరిపిన తీరు మాత్రం త్రీవ విమర్శలకు తావిస్తోంది. 
 
తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి వాళ్లు అంత హడావిడిగా, మొక్కుబడిగా ఈ వేడుకను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖలకు, అలాగే వివిధ అసోసియేషన్లకు, వివిధ ప్రముఖలకు, సాంకేతిక నిపుణలకు పిలుపులు లేకుండా, ఎవరో థర్డ్ పార్టీ ఆర్గనైజర్లుకు వేడుక నిర్వహించమని చేతులు దులిపేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. నిర్మాతల మండలిలో జాయింట్ సెక్రటరీగా ఉన్న నాకు ఆదివారం వేడుక అయితే శుక్రవారం మీటింగ్ లో  వేడుకకు రమ్మని, బాధ్యతలు పంచుకోమని చెప్పారు. దాంతో వారి నిర్వహణ తీరు నచ్చక, నేను వేడుకకు అసలు పోదలచుకోలేదు. ఇతర నిర్మాతలను, ఇతర ప్రముఖులను పిలకపోవడం అటుంచి కనీసం  "ఆర్ ఆర్ ఆర్" సినిమా హీరోలు కానీ నిర్మాత  కానీ హాజరు కాలేదంటే, వారి వీలు చూసుకోకుండా అంత అర్జెంటు గా పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది. 
 
అలాగే వేదికపై తెలంగాణ కు చెందిన మంత్రులు, ఎఫ్.డి. సి. చైర్మన్ వంటి ప్రముఖులు హాజరు కావడం సంతోషం. అయితే ఏపీ ప్రభుత్వానికి సంబందించిన మంత్రులు, ఎఫ్.డి. సి. చైర్మన్, ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ వంటి ప్రముఖులు ఎందుకు హాజరు కాలేదు. పరిశ్రమ తరపున మీరు పిలువ లేదా? లేక పిలిచినా వారు హాజరు కాలేదా?. దీనిపై అటు ఏపీ ప్రభుత్వం తరపున, ఇటు చిత్ర పరిశ్రమ తరపున సంబంధిత వ్యక్తులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఓ రకంగా ఏపీ ప్రభుత్వాన్ని అవమానించినట్లుగా నేను భావిస్తున్నాను.  తెలుగు నిర్మాతల మండలిలో నిధులు తగినంతగా లేక మెడి క్లెయిమ్ వంటి అత్యంత ముఖ్యమైన సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టేందుకు మీన మేషాలు లెక్కిస్తుంటే... ఈ వేడుకకు తగినంత టైం తీసుకుని, స్పాన్సర్స్ ద్వారా జరిపి ఉంటే, నిర్మాతల మండలి ఎదురు డబ్బు పెట్టకుండా, మెడి క్లెయిమ్ పాలిసీకి చెల్లించాల్సిన డబ్బు కూడా సమకూరేది. ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన నిర్మాత వై.రవిశంకర్ కూడా ఏవైనా ఈవెంట్స్ నిర్వహించి, నిర్మాతల మండలికి నిధులు సమకూర్చుకుని, సభ్యులకు సాయపడదామని అన్నారు కూడా. ఆ కోణంలో ఈ వేడుకను జరిపి ఉంటే, గ్రాండ్ గా ఉండటంతో పాటు నిర్మాతల మండలికి నిధులు సమకూరేవి. అయితే నిర్మాతల మండలిని నిధులను ఎదురు పెట్టేందుకు నేను ఎంత మాత్రం ఒప్పుకోను" అని అన్నారు.