శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:30 IST)

ప్లీజ్... ఒక్క నిమిషం అలా ఉండండి... వేడుకున్న జూ.ఎన్టీఆర్

ఏ సినిమా ఫంక్షన్‌కి హాజరైనా చివరన 'మీ కోసం వేచి చూసే వారు ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. ఈ సంతోషాన్ని వారితో కూడా పంచుకోండి..' అంటూ అభిమానులకు చెబుతూ ఉండే నందమూరి యువ హీరో ఎన్టీఆర్... ఈసారి ప్రసంగం ప్రారంభంతోనే ఆకట్టుకునేసాడు...
 
వివరాలలోకి వెళ్తే... నందమూరి కల్యాణ్ రామ్ - షాలిని పాండేలు జంటగా నటించిన చిత్రం ‘118’. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మాట్లాడేందుకు మైక్ అందుకున్న తారక్ ‘‘ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఓ ఘోరమైన సంఘటన గురించి మీ అందరికీ తెలిసిందే. 
 
మన దేశ భద్రత కోసం, మన భద్రత కోసం పని చేస్తున్న వారికి జరిగినటువంటి ఘోర సంఘటనకు గానూ.. మన దేశం కోసం అహర్నిశలూ కుటుంబాలను వదిలేసి పహారా కాస్తున్నటువంటి ఆ వీర జవాన్ల కోసం.. అలాగే ఈ మధ్య మా సినిమా ఇండస్ట్రీలో మేము కోల్పోయిన కొంత మంది దిగ్గజాల కోసం.. వీళ్లందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం మౌనం పాటించాలని మిమ్మల్నందరినీ వేడుకుంటున్నాను’’ అని కోరాడు. 
 
ఈ మాటతో అక్కడ ఉన్న వారంతా నిలబడి మౌనం పాటించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ.. అతని అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తారక్‌పై ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం అవుతోంది.