1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కొట్టుకున్న పల్లవి ప్రశాంత్ - అమర్ దీవ్ ప్యాన్స్

pallavi prashanth
తెలుగు బిగ్ బాస్ సీజన్-7 రియాల్టీ ఆదివారం రాత్రితో ముగిసిపోయింది. ఈ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలువగా, రన్నరప్‌గా అమర్ దీవ్ నిలిచాడు. అయితే, ఈ ఇద్దరు అభిమానులు మాత్రం హైదరాబాద్ నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తన్నుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలే దృష్ట్యా అభిమానాలు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమరీదీప్ అభిమానుల మధ్య అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 
 
బిగ్ బాస్ షో ముగియడంతో హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్ దీప్ వాహనాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. అమర్ కారు దిగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంతో కారులో ఉన్న అమర్ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
అభిమానుల మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణమైంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులను చెదరగొట్టి భద్రత మధ్య అమర్ దీప్‌ను పంపించారు. ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 
 
అయితే అక్కడే ఉన్న అమర్ దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు. అసభ్యపదజాలంతో తిట్టుకున్నారు. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్ - సికింద్రాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు, ఓ కారు అద్దాలను పగులకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.