"ఖైదీ నం.150" వర్సెస్ "గౌతమిపుత్ర శాతకర్ణి" : ఈ రెండు చిత్రాల మూల కథల సారాంశమిదే ...
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ రెండు సంక్రాంతి బరిలో నిలిచాయి. పైగా ఈ రెండు చిత్రాలకు ఈ ఇద్దరు హీరోలకు మైలురాళ్లు వంటివి. అందుక
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ రెండు సంక్రాంతి బరిలో నిలిచాయి. పైగా ఈ రెండు చిత్రాలకు ఈ ఇద్దరు హీరోలకు మైలురాళ్లు వంటివి. అందుకే ఎన్నో కసరత్తులు చేశాకే తెరపైకి ఎక్కించారు. అయితే, ఈ ఇద్దరు హీరోలు తమతమ చిత్రాలకు కథలను ఎంచుకునేందుకు బాగానే కసరత్తు చేశారనీ చెప్పొచ్చు.
ముఖ్యంగా చిరంజీవి కొన్నేళ్లపాటు పరుచూరి బ్రదర్స్ను ఊరించారు. ఆ తర్వాత చివరకు తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన హిట్ 'కత్తి' రీమేక్ జెండా ఊపారు. చెర్రీ నిర్మాతగా ఇది తొలియత్నం. 'ఠాగూర్'తో విజయం అందించిన వివి వినాయక్కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. 'బాస్ ఈజ్ బ్యాక్' కథ వెనుక జరిగిన తతంగం ఇది.
ఇక హీరోగా తన 100వ సినిమాకి బాలయ్య చాలా కథలు విన్నాడు. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో టైం మెషీన్ కాన్సెప్ట్తో గతంలో వచ్చిన 'ఆదిత్య 369'కి సీక్వెల్గా 'ఆదిత్య 999' స్క్రిప్ట్కి ఓకే చెప్పాడు. తర్వాత రైతుల కష్టాన్ని ప్రతిబింభించే రైతు కథ నచ్చి.. కృష్ణవంశీ డైరెక్టర్గా దాదాపు ఖరారు చేశాడు. అదే టైంలో క్రిష్ రంగప్రవేశం చేశాడు. తల్లిపేరుని తన పేరు ముందు పెట్టుకున్న చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథని చెప్పగానే.. తన వందో సినిమాకి ఇదే బెస్ట్ అని బాలయ్య అటు మొగ్గారు.
'ఖైదీ నెంబర్ 150' చిత్రానికి తమిళ 'కత్తి' మూలం. అయితే.. తెలుగు నేటివిటీకి చిరు ఇమేజ్కి తగినట్టుగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ సహా స్టోరీలో మార్పులు చేశారు. కార్పరేట్ సంస్థల దురాక్రమణతో ఉపాధి కోల్పోయి దిక్కుతోచని రైతులు సూసైడ్లు చేసుకోవడమనే థీమ్ చుట్టూ కథ తిరుగుతుంది.
ఇక బాలయ్య మూవీ విషయానికొస్తే.. చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతావనిని ఒకే పాలనలోకి తెచ్చిన తొలి భారతీయ చక్రవర్తి 'శాతకర్ణి' కథ ఇది. దర్శకుడు క్రిష్ కొన్ని చారిత్రక ఆధారాలను తీసుకుని, ఈ తెలుగు యోధుడి కథని 1900 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరమీదకి తెస్తున్నాడు. ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలను ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడో.. ఈ స్టార్ వార్లో ఎవరిది పైచేయో చూడాలి.