మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (15:30 IST)

వర్మ 'మర్డర్‌'కు కోర్టు ముకుతాడు - సినిమా విడుదలకు బ్రేక్

తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. ఆయన నిర్మించిన 'మర్డర్' సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుడి హత్య ఆధారంగా మర్డర్ అనే పేరుతో సినిమా తెరకెక్కించారు. 
 
తమ ప్రేమకథను నేపథ్యంగా తీసుకుని సినిమా తీయడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా తీస్తుండటంపై ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై కేసు విచారణ జరిపే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. 
 
ఈ నెల 6న అమృత కోర్టును ఆశ్రయించి నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలకు నోటీసులు పంపారు. రాంగోపాల్‌ వర్మ సైతం నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతుండగా ఆయనకు అమృత నోటీసు పంపలేదు. సినిమా విడుద‌లను నిలుప‌ద‌ల చేయాల‌ని, ప‌బ్లిసిటీ వెంట‌నే ఆపమ‌ని కోరుతూ అమృత‌ కోర్టును కోరారు.
 
 కాగా, సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. త్వరలోనే చిత్రాన్ని ఓటీసీ ఫ్లాట్‌ ఫామ్‌, ఆర్టీవీ వరల్డ్‌ టీవీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందుకు రాంగోపాల్‌ వరకు సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ సీఈసీ జరిమానా విధించింది. అనుమతి లేకుండా 'పవర్ స్టార్' మూవీ పోస్టర్లను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.