1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (09:56 IST)

నేడు మహాప్రస్థానంలో శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు

కరోనా వైరస్ సోకి కన్నుమూసిన ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ నగరం, పంజాగుట్టలో ఉన్న మహాప్రస్థానం శ్మశానవాటికలో జరుగనున్నాయి. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని మణికొండలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనకు కరోనా నెగెటివ్ అని పరీక్షల్లో తేలడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బంధువులు, హితులు, స్నేహితుల సందర్శనార్థం ఆయన ఇంటికి తరలించారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఇటీవల కరోనా వైరస్ బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శివశంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి 7.44 గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. 
 
కరోనా వైరస్ బారిన శివశంకర్‌కు ఊపరితిత్తులు 75 శాతం మేరకు ఇన్ఫెక్షన్ అయ్యాయి. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా ఐసీయు వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
అదేసమయంలో వైద్యం చేయించేందుకు డబ్బులు కూడా లేవని చిన్న కుమారుడు అజయ్ కృష్ణ చేసిన విజ్ఞప్తితో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కూడా ఆర్థిక సాయం చేశారు. వీరిలో బాలీవుడ్ నటుడు సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి, తమిళ స్టార్ హీరో ధనుష్ తదితరులు ఉన్నారు. 
 
అయితే, అందరినీ విషాదానికి గురిచేస్తూ ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరితో సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్‌, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
కాగా, ఈయనకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్, శివశంకర్ మాస్టార్ సతీమణి కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, 72 సంపత్సరాల శివశంకర్ 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో మగధీర చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. ఈయన 1975 నుంచి చిత్రసీమలో కొనసాగుతున్నారు.