శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (13:39 IST)

చంద్రబాబు అడ్డుకోవడం వల్లే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వలేదు : తమ్మారెడ్డి

ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వర్గీయ ఎన్.టి.రామారావుకు భారతరత్న అవార్డు రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనంటూ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ చేస్తున్న చంద్రబాబే దానిని గతంలో అడ్డుకున్నారని ఆరోపించారు. 
 
ఆయన తన యూట్యూబ్ చానెల్ నా ఆలోచనలో మాట్లాడుతూ, గణతంత్ర వేడుకల రోజున ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఎన్టీరామారావు పేరు లేకపోవడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారన్నారు. కానీ, ఈ విషయంలో తనకు చంద్రబాబుపై ఎప్పటినుంచో అనుమానం ఉందన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబుకు భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదన్నారు. 
 
అయితే, అవార్డులు ప్రకటించేంత వరకు సైలెంట్‌గా ఉండి, ఆ తర్వాత హడావుడి చెయ్యడం వెనక పెద్ద స్టోరీనే ఉందని అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే కుటుంబం మొత్తం వెళ్లాలని, ఆయన భార్యగా ఉన్న లక్ష్మీపార్వతి అవార్డును అందుకోవాల్సి ఉంటుందని తమ్మారెడ్డి వివరించారు. 
 
ఆ పురస్కారాన్ని లక్ష్మీపార్వతి అందుకోవడం వీరికి ఇష్టం లేదని, అందుకనే కావాలనే జాప్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చాలా మంది బతుకుతున్నారనీ, అలా బతకడంలో తప్పులేదు కానీ, ఆయన పేరును మాత్రం భ్రష్టుపట్టించవద్దన్నారు.