స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు
Telugu Chamber small producers
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కొందరు తమ స్వార్థంతో ప్రయత్నిస్తున్నారని అసోసియేషన్ లోని పలువురు నిర్మాతలు అన్నారు. తెలుగు ఫిలింఛాంబర్ మాజీ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ మాజీ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలుగు ఫిలింఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ ఈసీ మెంబర్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ జూలైతో ప్రస్తుత బాడీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈ రోజు తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు బసిరెడ్డి కార్యాలయంలో సమావేశమైన నిర్మాతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. అసోసియేషన్ నిబంధనల ప్రకారం రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని, అయితే ఇప్పుడున్న వారినే కంటిన్యూ చేయాలని కొందరు తమ సొంత ఎజెండా పెట్టుకుని ప్రతిపాదించడం సరికాదని అన్నారు. ఇప్పుడున్న బాడీనే కొనసాగుతుందని కొందరు మీడియాల్లో దిగజారుడు ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని, ఎన్నికలు అడ్డుకోవాలని చూసేవారి ఆటలు సాగవని నిర్మాతలు హెచ్చరించారు.
ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్మాతలు బసిరెడ్డి, డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్మాతలందరూ కలసి తెలుగు ఫిలింఛాంబర్ కు మెమొరాండం సమర్పించనున్నారు. మెమోరాండం సమర్పించిన తరువాత. మీడియా సమావేశం ఉంటుంది. కాబట్టి నిర్మాతలంతా ఈ మెమొరాండం సమర్పణ కార్యక్రమం మరియు ప్రెస్ మీట్ లో పాల్గొనాలని ఈరోజు సమావేశమైన నిర్మాతలు కోరారు. ఈ సమావేశంలో నిర్మాతలు రమేష్ నాయుడు, లయన్ సాయి వెంకట్, కె. సురేష్ బాబు, బోడపాటి మురళి, రవీంద్ర గోపాల్ జి.సుదర్శన్ రావు, గురురాజ్, వింజమూరి మధు, శంకర్ గౌడ్, భానూరు నాగరాజు, బండారు అమర్, పి ఎల్ కె.రెడ్డి, రంగా రవీంద్ర గుప్త (బుల్లెట్ రవి), మున్నవర్ అలీ, మిత్తాన ఈశ్వర్,RVN వరప్రసాద్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.