ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 15 మే 2023 (13:36 IST)

ఆకట్టుకుంటున్న రూల్స్ రంజన్ మొదటి పాట

Kiran Abbavaram, Neha Shetty
Kiran Abbavaram, Neha Shetty
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'రూల్స్ రంజన్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది.
 
'నాలో నేనే లేను' : విభిన్న ప్రేమ గీతం 
 
'నాలో నేనే లేను' లిరికల్ వీడియోని సోమవారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. తన ప్రేమను కథానాయకకి చెప్పడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చూపించారు. కళ్లద్దాలు, నుదుటున బొట్టుతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్న కథానాయకుడు.. నాయికని ఫాలో అవుతూ ఆమె గురించి పాడుకోవడం ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో నాయికలా నాట్యం చేయబోయి కథానాయకుడు కిందపడటం, ఆమె నడిచొస్తుంటే అతను పూలు చల్లడం వంటి సరదా సన్నివేశాలు అలరించాయి. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం వినసొంపుగా, ఆహ్లాదకరంగా ఉంది. సంగీతానికి తగ్గట్టుగానే రాంబాబు గోసాల అందించిన సాహిత్యం ఎంతో హాయిగా, స్వచ్ఛంగా ఉంది. అందరికీ అర్ధమయ్యే భాషలో ఎంతో అర్థవంతంగా పాటను రాశారు. ఇక శరత్ సంతోష్ ఎంతో అందంగా పాటను ఆలపించి కట్టిపడేశారు.
 
 గీత రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. " రూల్స్ రంజన్ చిత్రంలో నాలో నేనే లేను అనే పాట రాసినందుకు చాలా సంతోషం, మా దర్శకులు రత్నం కృష్ణ గారు చాలా మంచి సందర్భాన్ని నాకు వివరించారు. చాలా అందమైన చిన్న చిన్న పదాలతో తన ప్రేమని కథానాయిక కి తెలియజేయడం కోసం కథానాయకుడు పడే తపన ఈ పాటలో చెప్పాము. 'నాలో నేనే లేను నీలోనే ఉన్నాను' అంటూ మొదలయ్యి నేను ఊహల్లో లేను ఎప్పుడూ నీ ఊసుల్లోనే ఉంటున్నాను నువ్వు ఏం మాయ చేసావు నీ రూపం ఒక మాయ నువ్వే ఒక మాయ నాకు నిద్ర పట్టట్లేదు కానీ చాలా హాయిగా ఉంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అనుకుంటూ తన ఫీలింగ్స్ ని చెప్పుకునే పాట. చాలా అందమైన బాణీకి చాలా మంచి తేలిగ్గా పాడుకునేటట్లుగా ఉండే పదాలతో పాటని రాయమని చెప్పారు. చరణాలు కవితాత్మకంగా చెప్పాము.పువ్వులా నువ్వు వస్తే నీ నుంచి వచ్చే పరిమళాల గాలి నాతో మాట్లాడింది అని, నువ్వు సిగ్గుపడుతూ నవ్వుతుంటే నన్ను నేను మర్చిపోయానని చరణాలు స్టార్ట్ అవుతాయి. నాతో ఇంత మంచి పాట రాయించినందుకు మా దర్శకులకి కృతజ్ఞతలు, అలాగే హీరో హీరోయిన్లు కిరణ్ అబ్బవరం గారు నేహా శెట్టి ఈ పాటలో చాలా అందంగా కనిపించారు. చాలా చాలా బాగుంది విజువల్ గా, సంగీత దర్శకులు అమ్రిష్ గారు చాలా మంచి బాణీ అందించారు. అలాగే గాయకులు శరత్ సంతోష్ చాలా బాగా పాడారు. ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇంత మంచి ప్రొడక్షన్లో ఇంత మంచి సినిమాకి ఇంత మంచి పాట రాసినందుకు మా నిర్మాతలకి అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన మా టీం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పాటని సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. కథానాయకుడు కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ,ఇమేజ్ కు భిన్నంగా ఈ చిత్రం సరికొత్తగా ఉండటం తో పాటు, పూర్తి స్థాయి వినోద భరిత కథాచిత్రమిది.  సగటు సినిమా ప్రేక్షకుడు మనసారా వినోదాన్ని ఆస్వాదించే చిత్రమవుతుంది. ఇందుకు చిత్ర కథ, నాయకా నాయికల పాత్రలు, కథానుగుణంగా సాగే ఇతర ప్రధాన తారాగణం పాత్రలు, సంభాషణలు, సంగీతం ఇలా అన్నీ సమపాళ్లలో చక్కగా కుదిరిన ఓ మంచిత్రం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, దర్శకుడు  రత్నం కృష్ణ. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై నెలలో చిత్రాన్ని విడుదల చేయాలన్నది సంకల్పం అని తెలిపారు.