నన్ను విమర్శించేవారంతా స్త్రీ ద్వేషులు.. వారిని చూస్తే నెటిజన్ల ఇగో హర్ట్ అవుతుంది : అనుష్క శర్మ
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించారు. తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించేవారంతా స్త్రీ ద్వేషులని మండిపడ్డారు. పైగా మగాళ్ళకు ఇగో ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
భారత క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుష్క శర్మకు మధ్య లవ్వాయణం సాగుతున్న విషయం తెల్సిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విస్తృతంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొన్ని నెగెటివ్గా ఉంటే మరికొన్ని పాజిటివ్గా ఉన్నాయి.
వీటిపై ఇన్నాళ్లు స్పందించకుండా మిన్నకున్న అనుష్క శర్మ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని తనపై విమర్శలు గుప్పిస్తోన్న వారంతా స్త్రీ ద్వేషులు అని అభివర్ణించింది. విజయవంతంగా ఎవరిపై ఆధారపడకుండా బాధ్యతలు నిర్వహిస్తోన్న మహిళలను చూస్తే నెటిజన్ల ఈగో హర్ట్ అవుతుంది అని ఆమె పేర్కొంది. నెటిజన్లు తనకు సంబంధంలేని విషయంపై తనపై కామెంట్లు చేస్తూ, విమర్శలు గుప్పించడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.