బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (16:31 IST)

భార్య కోరికను అలా తీర్చాడు.. రాజస్థాన్ టీచర్ ఏం చేశారో తెలుసా?

భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక ఈ ఘటన. భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ రాజస్థాన్ టీచర్ తన రిటైర్మెంట్ రోజున ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. ఆ హెలికాఫ్టర్‌లో తన భార్యతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. చాపర్‌ను అద్దెకు తీసుకోవాలంటే ఎంత ఖర్చవుతుందని ఓసారి భార్య తనను అడిగిందని... ఆ కోరిక మేరకు తన పదవీవిరమణ రోజున తీర్చాలని నిర్ణయించుకున్నట్టు ఆళ్వార్‌లో టీచర్‌గా పనిచేస్తూ రిటైరైన ఉపాధ్యాయుడు రమేష్‌ చంద్‌ మీనా చెప్పారు. 
 
పదవీవిరమణ రోజు రాగానే రమేష్‌ చంద్‌ మీనా తన భార్య, మనవడితో కలిసి తన స్కూల్‌కు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ నుంచి జైపూర్‌ మీదుగా 150 కిమీ దూరంలో ఉన్న తన స్వగ్రామం మలవాలికి హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. తన భార్య కోరికను తీర్చేందుకు న్యూఢిల్లీ నుంచి రూ 3.7 లక్షలు వెచ్చించి హెలికాఫ్టర్‌ను బుక్‌ చేశానని రమేష్‌ మీనా వెల్లడించారు. 
 
తాము కేవలం 18 నిమిషాల పాటే విమానంలో విహరించినా ఇది తమకు మరుపురాని అనుభూతి మిగిల్చిందని రమేష్ వెల్లడించారు. భార్య కోరికను అలా తీర్చి.. ఆమెకు మరపురాని అనుభూతిని మిగిల్చానని రమేష్ వ్యాఖ్యానించాడు.