శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (09:32 IST)

ఆర్టికల్ 370 రద్దు : కాశ్మీర్ అమ్మాయిని పెళ్లాడనున్న రాజస్థాన్ యువకుడు

రాజస్థాన్ యువకుడు ఒకరు కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన అధికరణ 370 రద్దు తర్వాత జరుగనున్న తొలి ప్రేమ వివాహం ఇదే కావడం గమనార్హం. 
 
నిజానికి ఆర్టికల్ 370 రద్దుకు ముందు కాశ్మీర్ అమ్మాయి ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులను పెళ్లి చేసుకుంటే ప్రత్యేక హక్కును కోల్పోయేవారు. కానీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ పరిస్థితి లేదు. దీంతో కాశ్మీర్ అమ్మాయిలకు, రాష్ట్రేతరులను వివాహం చేసుకునే అవకాశం లభించింది. ఫలితంగా ఈ వివాహం ఇపుడు తొలి వివాహంగా నమోదుకానుంది. 
 
ఓ కాశ్మీర్ యువతి, రాజస్థాన్‌కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోనుంది. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఓ కశ్మీర్ అమ్మాయిని పెళ్లాడనుడటం ఇదే ప్రథమం.
 
కాగా, వీరిద్దరికీ గతంలోనే పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారగా, పరిస్థితులు కలిసి రావడంతో, వీరు పెళ్లికి సిద్ధమయ్యారని సమాచారం. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ నడుస్తున్నప్పటికీ, పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. నరేంద్ర మోడీ సర్కారు పుణ్యమాని వీరు ఒకటి కానున్నారు.
 
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన అక్షయ్, కొంతకాలం ముందు న్యూఢిల్లీలో ఉద్యోగం చేశాడు. అదేసమయంలో కాశ్మీర్‌కు చెందిన కామినీ రాజ్‌పుత్, ఢిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోతుందని తల్లిదండ్రులు భయపడి పెళ్లికి అడ్డు చెప్పారు.
 
కానీ, ఆర్టికల్ 370 రద్దుతో అడ్డంకులు తొలగిపోగా, సామాజిక వర్గాలు వేరైనా, ఇద్దరూ తమ పెళ్లికి కుటుంబ పెద్దలను ఒప్పించారు. ఇప్పుడు తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని, మోడీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అక్షయ్ అంటున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగగా, మరో రెండు వారాల్లో వివాహాన్ని వైభవంగా నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు.