బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2025 (11:26 IST)

నేటి నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టిక్కెట్ల విక్రయాలు

champion trophy
పాకిస్థాన్ వేదికగా వచ్చే నెల నుంచి ఐసీసీ చాంపియన్స్ క్రికెట్ టోర్నీ జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా, ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్ వేదికగా జరుగనున్నాయి. ఈ మెగా ఈవెంట్ వచ్చే నెల 19వ తేదీన ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌అమ్మకాలు జనవరి 28వ తేదీ మంగళవారం ప్రారంభమయ్యాయి. టికెట్లు ఆన్‌లైన్‌లోనూ, పాకిస్థాన్‌లోని 100 అవుట్ లెట్లలోనూ అందుబాటులో ఉంటాయి.
 
ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, పాకిస్థాన్‌లో తాము మ్యాచ్‌లు ఆడబోమని భారత్ తెగేసి చెప్పడంతో, హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీ నిర్వహిస్తున్నారు. టీమిండియా ఆదే మ్యాచ్‌లకు దుబాయ్ వేదికగా నిలుస్తుంది.
 
ఇక, పాకిస్థాన్‌‌లో కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో సెమీఫైనల్ సహా పాకిస్థాన్‌‌లో జరిగే 10 మ్యాచ్‌లకు మంగళవారం నుంచి టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్‌ల టికెట్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. 1996లో వరల్డ్ కప్ నిర్వహించాక పాకిస్థాన్‌లో జరుగుతున్న మరో గ్లోబల్ టోర్నమెంట్ ఇదే. దాంతో పాక్‌లో క్రికెట్ మేనియా ఓ భారీ స్థాయిలో నెలకొంది.
 
మరోవైపు, ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్థాన్, టీమిండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. ప్రతి గ్రూప్‌‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. మార్చి 9న దుబాయ్‌లో ఫైనల్ జరగనుంది.