1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2019 (15:26 IST)

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబయి రాజపక్సే విజయం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబయి రాజపక్సే విజయం ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్సే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు. అధికారికంగా రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా ప్రకటించనున్నారు. అయితే రాజపక్సే గెలిచినట్టు ఇటు ఎస్ఎల్‌పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి. 
 
ఆదివారం ఉదయం 11 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్సే 52.87 ఓట్లు గెలుచుకోగా, గృహ మంత్రి సజిత్ ప్రేమదాసకు 39.67 శాతం, లెఫ్టిస్ట్ అనుర కుమార దిస్సానాయకె 4.69 శాతం ఓట్లు పొందినట్టు శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 
 
శ్రీలంక పోడుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) అభ్యర్థిగా ఎన్నికల్లోకి దిగిన 70 ఏళ్ల రాజపక్సే దేశానికి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద్ర రాజపక్సే సోదరుడు కావడం విశేషం. రక్షణ శాఖ మాజీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. వివాదాస్పద నాయకుడిగా ఆయనకు పేరుంది. 2008-2009లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధనేరాలకు పాల్పడిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన తన అమెరికా పౌరసత్వాన్ని వదలుకున్నారు.