మాట మార్చిన డోనాల్డ్ ట్రంప్ - ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం!!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మాటమార్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఈ రెండు దేశాలు అలసిపోయాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఎంపుడైనా మళ్లీ యుద్ధం జరగొచ్చని పేర్కొన్నారు. అదేసమయంలో వచ్చే వారమే ఇరాన్తో అణు చర్చలు జరుపుతామని వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్నదే తమ ఏకైక లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం సాగింది. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగిసిపోయిందంటూ కొన్ని పోస్టులు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చనే అనుమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, 'ఆ రెండు దేశాలతో (ఇజ్రాయెల్-ఇరాన్) నేను చర్చలు జరిపాను. అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయి' అని తెలిపారు. అయితే, ఇదే సమయంలో భవిష్యత్తు పరిణామాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అంటే బహుశా ఏదో ఒకరోజు రావొచ్చు. త్వరలోనే మళ్లీ ప్రారంభం కావొచ్చు' అంటూ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ పునరావృతమయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు.
అలాగే, ఇరాన్తో అణు ఒప్పందం విషయమై కూడా ట్రంప్ ప్రస్తావించారు. వచ్చే వారంలో ఇరాన్తో అణు చర్చలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవైపు శాంతి నెలకొందని వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవచ్చని ట్రంప్ చెప్పడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.