మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి మండలి అధ్యక్షుడు దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్కు అలవాటు పడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొని డ్రగ్స్పై తమ గళం వినిపించారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను ఈ సందర్భంగా వారు వివరించారు. యువతకు దిశానిర్దేశం చేశారు.
ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ, మలయాళ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారన్నారు. అక్కడ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారిని పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలంగాణ ఎఫ్.డి.సి తరపున తెలుగు చిత్రపరిశ్రమ తరపున తాను కోరేది ఒక్కటేనన్నారు. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత వ్యక్తులను ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండా నిషేధించాలి.
అపుడే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని చిత్రపరిశ్రమ పెద్దలతో చర్చించి, తెలుగు సినిమాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఇది మనందరి కర్తవ్యమని దిల్ రాజు పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.