మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (16:12 IST)

భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం

nobel award
భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ఈ యేడాది ఇద్దరికి నోబెల్ పురస్కారం వరించింది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్‌రీ ఈ.హింటన్‌లు సంయుక్తంగా ఈ నోబెల్ బహుమతిని అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌తో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకుగాను వీరికి ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ మేరకు స్టాక్ హోం కేంద్రం ఉన్న కరోనిల్ స్కా ఇనిస్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, గత యేడాది భౌతికశాస్త్రంలో ఈ పురస్కారాన్ని ముగ్గురికి అందించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త పియర్ అగోస్తి, హంగేరియన్ సంతతికి చెందిన ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్ - స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్.వ్యూలియర్‌లు ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్ారు. మొత్తంగా 1901 నుంచి ఇప్పటివరకు 117 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించారు.
 
కాగా, వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబరు 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
 
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.