శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (12:54 IST)

పాకిస్థాన్‍ను వణికిస్తున్న మంకీ పాక్స్... ఒక కేసు గుర్తింపు..

Vampire viruses
ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టించిన మంకీపాక్స్ ఇపుడు పాకిస్థాన్‌లో కలవరానికి గురిచేస్తుంది. దీంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాగా తాజాగా పాకిస్థాన్‌‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్‌ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. దేశంలో మూడు మంకీ పాక్స్‌ కేసులు నమోదైనట్లుగా ఆగస్టు 13వ తేదీన పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్శిటీ వెల్లడించింది. 
 
కాగా వారితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ పేర్కొంది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధరణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పట్లో 11 కేసులు నమోదవగా ఒకరు మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 
 
122 దేశాల్లో 99,518 మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండడంతో అక్కడ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.