డొనాల్డ్ ట్రంప్ అంతుతేలుద్దాం.. కోర్టుకెక్కిన 97 టెక్ దిగ్గజ కంపెనీలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఆ దేశంలోని టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధిస్తోన్న ఆంక్షలు చట్టాలకు, రాజ్యాంగానికి వ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఆ దేశంలోని టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏకమయ్యాయి. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధిస్తోన్న ఆంక్షలు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
ఇప్పటికే ఏడు ముస్లిం దేశాల ప్రజలు తమ దేశంలోకి రాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెల్సిందే. దీనిపై స్టే విధించేందుకు కూడా శాన్ఫ్రాన్సిస్కో కోర్టు అంగీకరించలేదు. ఇది ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ వంటిదే.
ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్కు టెక్ దిగ్గజాల నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయా కంపెనీల నుంచి లీగల్ వార్ ప్రారంభమైంది. ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ వంటి 97 టెక్నాలజీ దిగ్గజాలు ఆ దేశంలోని న్యాయస్థానంలో మోషన్ రూపంలో ఫిర్యాదు దాఖలు చేశాయి.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్స్ ఆర్డర్స్, విధిస్తోన్న ఆంక్షలు చట్టాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సదరు నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను తాము ఆకట్టుకోవడాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి లీగల్ పిటిషన్ ఇంతకు ముందు అమెజాన్, ఎక్స్ పీడియాలు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.