మహాభారతం సీరియల్ చాలా పెద్దది. అన్ని ఎపిసోడ్స్కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు అని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ అన్నారు. తాజాగా ఆయన విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చేశారు. జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మాణంలో కన్నప్ప రూపొందింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పలు విషయాల్ని పంచుకున్నారు.
- విష్ణు టీం నుంచి నాకు ఓ సారి కాల్ వచ్చింది. మహా భారతం సీరియల్కు నాతో పాటు ఇంకా కొంత మంది కూడా డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్,విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు.
- విష్ణు నన్ను హైదరాబాద్కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఓ మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.
* నేను ఇంత వరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. మహా భారతం సీరియల్ను రూ. 200 కోట్లతో తీశాం. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇది వరకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. నేను బుల్లితెరకు పని చేసినా, వెండితెరకు పని చేసినా ఒకే మైండ్ సెట్తో పని చేస్తాను.
* కన్నప్ప కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ సర్, మోహన్లాల్ సర్, ప్రభాస్ సర్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం గారు ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు గారు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.
- కన్నప్ప మీద ఇంత వరకు వచ్చిన కన్నడ, తెలుగు, హిందీలో చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు గారు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది.
* మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే న్యూజిలాండ్కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం.
* ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.
* కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు.
* కన్నప్ప అనేది మైథలాజి కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర.
* మహాభారతం సీరియల్ తీశాను. ఇప్పుడు సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. మహాభారతం అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు. రాజమౌళి గారు తీసుకోవచ్చు. ఆమిర్ ఖాన్ గారు తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్.