ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)
స్మగ్లర్లు వింత వింతగా ఆలోచనలు చేస్తున్నారు. తాము చేసే స్మగ్లింగ్ సాఫీగా సాగిపోయేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఖర్జూరం పండ్ల మాటున బంగారం స్మగ్లింగ్ చేయడాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ స్మగ్లింగ్ గట్టును బహిర్గతం చేశారు. ఆ ప్రయాణికుడు వద్ద 172 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఎస్వీ 756 విమానంలో జెడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన 56 యేళ్ల వయసున్న ఒక ప్రయాణికుడుపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై వారికి అనుమానం వచ్చింది. అతని వద్ద ఖర్జూర పండ్ల మాటను ఓపెన్ చేసి పరిశీలించారు.
ఆ పండ్లలో బంగారు ముక్కలను అమర్చినట్టు గుర్తించారు. ఆ ఖర్జూర పండ్ల బ్యాగులో ఒక బంగారు చైన్ను కూడా అధికారులు గుర్తించారు. ఖర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.